13, నవంబర్ 2010, శనివారం

ఎవ్వరితొనూ అనమాకండి స్వాముల్లారా

చిన్నప్పుడు హైస్కూల్ కి రొజూ నడిచి పోయే వాళ్ళం.పోయే దారిలో కొత్త కాలవ అని ఒక కాలవ ఉండేది.ఆ కాలవ నిండా నీళ్ళు వచ్చిన రోజు బడి ఎగ్గొట్టే వాళ్ళం.సాయంత్రం దాకా ఈతలే ఈతలు.ఐతే మేం ఇట్లా ఈతలు కొట్టడం మా వూళ్ళోఒకాయన కి అసలు ఇష్టముండేది కాదు.ఆయన పేరు జవహర్లాల్.
ఒకరోజు అందరం జోరుగా ఈతలు కొడతన్నాం.ఈతలు వేసేటప్పుడు బట్టలన్నీ విప్పి ఒడ్డుమీద పెట్టేవాళ్ళం.ఆరోజు కూడాఅట్లానే ఉదయం నుంచీ ఈతలే ఈతలు. మధ్యాహ్నం అక్కడే ఒడ్డు మీద అన్నాలు తినేసి మళ్ళీ కాలవలో మా లోకం లో మేమే. బడి వదిలే వేళకి ఒడ్డు మీదకి వచ్చాం. వస్తే ఏముంది ...గట్టు మీద బట్టలేవీ ?
 దూరంగా మా బట్టలు చంకలో పెట్టుకుని వెల్తూ జవహర్లాల్! ఆయన గారి చేను ఆ కాలవ పక్కనే ఉండటం మా చావుకొచ్చింది. ఏం చేయాలిప్పుడు.. వెంకన్న,నాగమల్లెశ్వరరావు అనే ఇద్దరు పదో తరగతి వాళ్లకు తప్ప మాకెవ్వరికీ ఒంటిమీద నూలుపోగు లేదు.అప్పుడుడు నేను ఆరో తరగతి.
ఏం చెయ్యాల్రా నాయనా అనుకున్నాం.ఇంకొల్లు భాస్కర్రావో ఎవుడో ఒక ఐడియా చెప్పాడు.మా అందరి సంచుల్లో తగరపు కాయితాలు ఉండేవి.వాన పడితే పుస్తకాలు తడవకుండా ఆ ఏర్పాటు.ఆ తగరపు కాయితాలు తీసి మొలలకు చుట్టుకుని చీకట్లో వాముల వెనగ్గా,నయ్యిల చాటుగా దాక్కుంటా దాక్కుంటా ఇంటికి చేరాం.---నవ్వుకుంటే నవ్వుకున్నారు గానీ ఇంకెవ్వరి తొనూ అనమాకండి స్వాముల్లారా...

1 కామెంట్‌: